AP Government fee reimbursement funds Released | Check now

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు.. నిధులు విడుదల..

AP Government fee reimbursement funds: రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. రూ.600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశామని.. ఇప్పుడు మరో రూ.600 కోట్లు.. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు తీపికబురు వినిపించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గానూ అదనపు మొత్తం నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడతగా ఇప్పటికే రూ.788 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. త్వరలోనే మూడో విడతలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవటంతో ఫీజుల కోసం కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు చేసింది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేరుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేసేది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఈ విధానంలో మార్పులు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసేది. ఆ తర్వాత విద్యార్థుల తల్లులు ఫీజును కాలేజీలకు చెల్లించేలా మార్పులు చేశారు. ఆ తర్వాత విద్యార్థి – తల్లి జాయింట్ ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేస్తూ వచ్చారు.
అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ విధానంలో మార్పులు చేసింది. విద్యార్థుల తల్లులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని గ్రహించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాల అకౌంట్లలోకే జమ చేసేలా మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓసారి 788 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి రూ.600 కోట్లు నిధులు విడుదల చేసింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top