ఆధార్ సెంటర్ నడపాలనుకుంటున్నారా? – అయితే ఈ పరీక్ష పాసవ్వాల్సిందే.
యూఐడీఏఐ నిర్వహించే పరీక్షలో 65 శాతం మార్కులు వస్తేనే అవకాశం – పదేళ్లుగా కేంద్రాలను నిర్వహిస్తున్న వారూ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే – తెలంగాణలోని ఆధార్ శాశ్వత కేంద్రాలన్నీ ఇన్–హౌస్ మోడల్ విధానంలోకి
Aadhaar Testing and Certification Exam : ఆధార్ శాశ్వత కేంద్రాలను నడపాలంటే ఇకపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్వహించే పరీక్షలో 65% మార్కులు తెచ్చుకోవాలి. పదేళ్లుగా కేంద్రాలను నిర్వహిస్తున్న వారు సైతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తెలంగాణలోని ఆధార్ శాశ్వత కేంద్రాలన్నీ ఏక రీతి (ఇన్-హౌస్ మోడల్) విధానంలోకి మారడమే ఇందుకు కారణం. ఈ విధానాన్ని యూఐడీఏఐ మూడేళ్ల క్రితం నుంచే అమలు చేస్తోంది. మన రాష్ట్రంలోని కొందరు ఆధార్ కేంద్రాల నిర్వాహకులు వేతనాలకు బదులు కమీషన్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విధానం అమలులోకి రాలేదు. హైకోర్టు ఇటీవల యూఐడీఏఐ ప్రతినిధులు, నిర్వాహకుల మధ్య సయోధ్య కుదిర్చింది.
ఇన్-హౌస్ మోడల్ కేంద్రాలు :
- ఇన్-హౌస్ మోడల్ కేంద్రాల పరికరాలకు డిపాజిట్లు చెల్లించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వారికి ల్యాప్టాప్తో పాటు రూ.1.50 లక్షల విలువైన సామగ్రిని అందించనుంది.
- అవకతవకలకు పాల్పడిన నిర్వాహకులను తొలగించి కేంద్రాన్ని కొత్తవారికి అప్పగిస్తారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి.
- రాష్ట్రంలో మొత్తం 1,151 ఆధార్ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చెశారు. వాటిలో వివిధ కారణాలతో 424 మూతపడ్డాయి. ప్రస్తుతం 727 కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. కొత్త విధానంతో అన్ని కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.
నూతన కార్డులు, వేలిముద్రలు : ఇకపై ఇన్-హౌస్ కేంద్రాల్లో నూతన కార్డుల జారీ, వేలిముద్రల నవీకరణ మాత్రమే చేస్తారు. మీ-సేవ వంటి ఆన్లైన్ కేంద్రాల్లోనూ పేర్లు, చిరునామాలను అప్డేట్ చేసే సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, సెల్నంబరు వంటి వాటిని కార్డుదారులే నేరుగా ఆన్లైన్లో మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డును అప్డేట్ : కాగా ఆధార్ కార్డుల అప్డేట్కు కేంద్రప్రభుత్వం ఏడాది వరకు గడువు తేదీని పొడిగించింది. దీంతో వచ్చే సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డును సస్పెండ్ చేస్తారు. ఒక్కసారి ఆధార్కార్డు సస్పెండ్ అయితే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించి మళ్లీ కొత్త ఆధార్కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కార్డులను అప్డేట్ చేయడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారు. మరికొందరు అవగాహన లేక అందుకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఫోన్లో మై ఆధార్ యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేసుకుంటున్నారు.
ప్రతి పదేళ్లకు ఒకసారి : 10 సంవత్సరాల క్రితం కార్డులను పొందిన వారు ఆధార్కార్డులను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు సెల్ఫోన్లో సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్డుుల పది సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటయ్యే విధంగా నిబంధనలు తీసుకు వచ్చారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డును నవీకరించుకోవాలని సూచించారు.
ఎంతో కీలకం : ప్రస్తుతం అన్నింటికీ ఆధార్కార్డు కీలకంగా మారింది. బ్యాంకు అకౌంట్లు తెరవడం, విద్యార్థుల అడ్మిషన్లు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, రైతు భరోసా, రైతు బీమా లాంటి ప్రభుత్వ పథకాలకు ఆధార్ను తప్పనిసరి చేశారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే కొందరికి పింఛన్లు, రేషన్ కూడా ఆగిపోయే ప్రమాదముంది. కొందరు ఆధార్ ఐడీలు తీసుకున్నప్పటికీ అప్డేట్ చేసుకోలేకపోతున్నారు.
Iam Earlier Worked As Supervisor In Aadhaar Process Under Smartchip Ltd Co. In Various Locations. I Have Passed Certificate Course In Both Operator & Supervisor. I want To Run Aadhaar Center Pls..