These teachers didn’t just teach lessons – they paved the way for students’ golden futures.
ఈ గురువులు పాఠాలు మాత్రమే చెప్పలేదు – విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశారు
పాఠాలు చెప్పడం ఒక్కటే తమ బాధ్యత కాదని భావించిన టీచర్లు – విద్యార్థుల అభ్యున్నతికి అడుగులు వేసిన గురువులు – విద్యార్థులకు సకల సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం
Special Story On Teachers Day : స్కూల్ టీచర్స్ చాలా వరకు వస్తారు, పాఠాలు చెబుతారు, వెళ్లిపోతారు. కానీ కొంతమందికి మాత్రం ఒక్క టీచర్ లేదా సర్ గుర్తిండిపోతారు. కారణం వారు చెప్పే పాఠాలతో పాటు జీవిత సత్యాలు. పిల్లల సమస్యలు తెలుసుకుని వారికి తోచినంత సాయం చేస్తుంటారు. కుటుంబ సమస్యలున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా తోడుగా నిలుస్తారు. అలాంటి టీచర్లు దొరకడం అదృష్టంగా భావించాలి.
అచ్చం ఈ టీచర్లు అలానే ఆలోచించారు. పాఠాలు చెప్తే సరిపోదు, వారికి ఏదో ఒకటి చేయాలని తపన పడ్డారు. పాఠశాల అభివృద్ధి చెందితే విద్యార్థులు అభ్యున్నతి చెందుతారని భావించారు. ఒకవైపు పిల్లలకు పాఠాలు చెబుతూనే, మరోవైపు బడుల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. కొందరు సొంతంగా నిధులు వెచ్చించి పనులు చేస్తే, మరికొందరు దాతల సహకారంతో వివిధ పనులు చేపట్టారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దిన మాస్టార్లపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
పిల్లలకు అవసరమైనవి అందిస్తూ : మెదక్ జిల్లా అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం రవిరాజు రూ.25 వేలు ఖర్చు చేసి బడికి రంగులు వేయించారు. రూ.30 వేలతో వరండాను తరగతి గదులుగా మార్చారు. విద్యార్థులకు క్రీడా దుస్తులు, టైలు, బెల్టులు ఇప్పించారు. పిల్లలకు ఏదైనా అవసరం ఉన్నా, తనవంతు సహాయం చేస్తారు. అంతేకాదు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో బోధనా పద్ధతుల గురించి చెబుతున్నారు. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు కొంత మొత్తం సమకూర్చి పాఠశాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు.
స్కూల్ రూపురేఖలే మార్చి : మెదక్ జిల్లా రామాయంపేట బాలికల ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో సమీపంలోని అద్దె భవనంలోకి మార్చారు. ఏళ్లు గడుస్తున్నా నూతన భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో హెచ్ఎం రమ తనకు తెలిసిన ఓ ఫౌండేషన్ వారితో మాట్లాడి రూ.14 లక్షలతో శిథిల భవనాన్ని బాగు చేయించారు. దాతలు మరో రూ.7 లక్షలు ఖర్చు చేసి శౌచాలయాలు బాగు చేయించారు. వారి బంధువుల నుంచి రూ.3 లక్షలు సేకరించి గ్రిల్స్, నీటి శుద్ధి యంత్రం వంటివి ఏర్పాటు చేశారు. ఆమె కుమారుడు రవితేజతో రూ.12 వేలతో కుర్చీలు సమకూర్చారు. ఏటా 10వ తరగతి విద్యార్థులకు రూ.25 వేల చొప్పున నగదు పురస్కారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా నేడు అవార్డు అందుకోనున్నారు.
విద్యార్థులు శుద్ధి నీరు తాగాలని : తాను ఉద్యోగం చేస్తున్న స్కూల్లో విద్యార్థులకు శుద్ధి నీరు అందించాలని భావించారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రావణిరెడ్డి. ఈ క్రమంలోనే రూ.లక్ష వెచ్చించి శుద్ధి నీటి యంత్రం ఏర్పాటు చేయించారు.
ఆ ముగ్గురు ఒక్కటై : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాంబాబు, ఉపాధ్యాయులు శంకర్, యోగీశ్వర్ పాఠశాలలో చేరగానే సొంతంగా రూ.60 వేలు వెచ్చించి గేటు, బోర్డులు ఏర్పాటు చేయించారు. బడిలో మరమ్మతులు చేయించడంతో పాటు గోడలపై చిత్రాలు వేయించారు. హైదరాబాద్ రోటరీ క్లబ్ సభ్యులు మన్మోహన్, ఆదిత్య, కిరణ్ మిత్రబృందంతో కలిసి రూ.3.50 లక్షలతో అదనపు తరగతి గది నిర్మించారు. రామచంద్రమిషన్ వారు శౌచాలయాల నిర్మాణానికి ముందుకొచ్చేలా చేశారు.
